- ఇష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలు
- టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వెల్లడి
- తెలంగాణ పీపుల్స్ వాయిస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానం
హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల జీవితంలో ఇంటర్మీడియట్ అత్యంత కీలకమైన దశ అని, ఈ రెండేళ్లలో కనబరిచే ప్రతిభే బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ చైర్మన్ మల్క కొమరయ్య అన్నారు. మంగళవారం నగరంలోని పల్లవి ఇంజినీరింగ్ కాలేజీలో ‘తెలంగాణ పీపుల్స్ వాయిస్’ ఆధ్వర్యంలో ఇంటర్-2026 ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్కు ‘ఎక్సలెన్స్ అవార్డ్స్-2026’ ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి చీఫ్ గెస్టుగా కొమరయ్య హాజరై మాట్లాడారు.
‘థింక్ బిగ్.. వర్క్ హార్డ్.. గెట్ సక్సెస్’ అనే నినాదంతో స్టూడెంట్స్ తమ లక్ష్యాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడంలో యూత్ దే కీలక పాత్ర అని, గ్లోబల్ లెవెల్ స్కిల్స్ను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.
చాటింగ్లు, డేటింగ్లతో టైమ్ వేస్ట్ చేయొద్దు..
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర మాట్లాడుతూ యువత సోషల్ మీడియా, చాటింగ్స్, డేటింగ్స్ అంటూ కాలాన్ని వృథా చేసుకోవద్దని హెచ్చరించారు. ఎప్పుడూ ‘వాట్ నెక్స్ట్?’ అనే ఆలోచనతో కెరీర్ను బిల్డ్ చేసుకోవాలని హితవు పలికారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వై. వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ డిసిప్లిన్, నిరంతర శ్రమ ఉంటేనే సక్సెస్ వరిస్తుందని చెప్పారు
. నిరంతరం నేర్చుకునే తత్వమే మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో టాప్ మార్కులు సాధించిన సుమారు 300 మంది విద్యార్థులను మెడల్స్, ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీపుల్స్ వాయిస్ ప్రెసిడెంట్ కాలం మధుసూధన్ రెడ్డి, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ ప్రభాకర్ రావు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మంగ, పీఈసీ కాలేజీ ప్రతినిధులు పాల్గొన్నారు.
